హైదరాబాద్: ప్రాణాంతక వైరస్ గురించి రెండేళ్ల ముందే ఊహించానంటున్నారు దర్శకుడు రాంగోపాల్ వర్మ. దీనికి రుజువుగా 2018 జూన్ 10న తాను చేసిన ట్వీట్ను బయటపెట్టారు. రెండేళ్ల క్రితం తాను ఊహించినట్టుగానే ఇప్పుడు ‘కరోనా’ పరిణామాలు చోటుచేసుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ‘వైరస్’ పేరుతో సినిమా తీస్తున్నట్టు అప్పట్లో వర్మ ప్రకటించారు. సర్కార్, అటాక్స్ ఆప్ 26/11 సినిమాలు నిర్మించిన పరాగ్ సంఘ్వి తన సినిమాను నిర్మిస్తున్నారని ట్విటర్ ద్వారా వెల్లడించారు. దీంతో పాటు ఒక ప్రకటన లింక్ కూడా జత చేశారు. ‘వైరస్’ సినిమా కథ గురించి క్లుప్తంగా అందులో వివరించారు.
మధ్య ఆఫ్రికాలో వైరస్ బారిన పడిన ఓ విద్యార్థి నుంచి ఈ మహమ్మారి కార్చిచ్చులా ముంబై నగరమంతా వ్యాపిస్తుంది. భాయాందోళనతో చేష్టలుడిన ప్రభుత్వం ముంబై వాసులను పరస్పరం 20 అడుగుల భౌతిక దూరం పాటించమని సూచిస్తుంది. వైరస్ విజృంభణతో మరణాల సంఖ్య లక్ష దాటిపోవడంతో వైరస్ వ్యాప్తిని నివారించేందుకు బాహ్య ప్రపంచంతో ముంబై సంబంధాలను ప్రభుత్వం కట్ చేస్తుంది. నిర్బంధం నుంచి ఎవరైనా తప్పించుకోవాలని చూస్తే కాల్చి చంపాలని ప్రభుత్వం తీవ్ర ఆదేశాలు జారీ చేస్తుంది. ఒక్కపక్క భయాందోళనతో వణుకుతున్న నగర ప్రజలు, నిస్సహాయ ప్రభుత్వం.. మరో పక్క వైరస్ విజృంభణ నేపథ్యంలో కథ సాగుతుంది. భయం, విషాదం, త్యాగం, ఆశ, నిరాశ వంటి ఉద్వేగాల మేళవింపుతో సినిమా ఉంటుందని వర్మ అప్పట్లో పేర్కొన్నారు. అయితే ఎందుకనో ఈ సినిమా తెరకెక్కలేదు. (ట్రెండింగ్లో ఆర్జీవీ ‘పురుగు’ పాట!)